బస్తీ దవాఖానలతో మెరుగైన వైద్యం

 

హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బస్తీ  దవాఖానలతో మంచి ఫలితాలోస్తున్నాయి. ప్రతి పేదవాడికి కార్పొరేట్‌ తరహాలో వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. సూర్య నగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ద్వారా పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు  మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.  ప్రతి రోజూ 50 నుంచి 80   మంది వరకు రోగులకు పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు. 

పేదలకు వరం.. 

పేదల చెంతకే వైద్యం అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలతో ప్రజలకు మంచి వైద్యం అందుతున్నది. కూలీ పనిచేసుకుని బతుకుతున్న నిరు పేదలకు ఈ బస్తీ దవాఖానలు వరంలా మారాయి. జ్వరం వస్తే  అధిక ఫీజులు గుంజుతారన్న భయంతో ప్రైవేట్‌ దవాఖానలకు వెళ్లే పరిస్థితి లేదు. అలాంటి వారికి బస్తీ దవాఖానలు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. బీపీ షుగర్‌ మందులను కూడా అందిస్తున్నారు. సూర్య నగర్‌ బస్తీతో పాటు చిక్కడపల్లి, నెహ్రూనగర్‌ తదితర బస్తీల ప్రజలకు ఈ దవాఖానలు అందుబాటులోకి వచ్చాయి. జ్వరం, దగ్గు, చర్మ సమస్యలు, చిన్న పిల్లల వ్యాధులు, గర్భిణులకు చికిత్సలు, గాయాలకు డ్రెస్సింగ్‌, బీపీ, షుగర్‌, మలేరియా, డెంగీ తదితర వ్యాధులకు ఈ బస్తీ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్‌, నర్సులు, అందుబాటులో ఉంటారు . వైద్యం అందించడంతో పాటు  అన్ని రకాల రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు.  

అన్ని రోగాలకు మందులు..

అన్ని రోగాలకు వైదం అందించి మందులు ఇస్తున్నారు. పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నది. బీపీ షుగర్‌ మందులు కూడా అందిస్తున్నారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలందిస్తున్నారు.