అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

 

హైదరాబాద్‌ ,(ఆరోగ్యజ్యోతి):  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాళులర్పించారు. సీఎంతో కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనచారి, మేయర్‌ విజయలక్ష్మి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గన్‌ పార్క్‌ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా ప్రగతిభవన్‌ చేరుకొని ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కొవిడ్‌ నేపథ్యంలో వరుసగా రెండో సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా సాగుతున్నాయి.