హైదరాబాద్‌కు హరీష్‌రాజ్‌

 


జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేసిన డాక్టర్‌ హరీష్‌రాజ్‌ను ఎంజీఎం ఆసుపత్రిలో ఆర్‌ఎంఓ-1గా ప్రభుత్వం నియమించడం ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదని తెలిసింది. నిన్నటి వరకు జిల్లా అధికారిగా ఉండి ఆర్‌ఎంఓ-1గా ఒక సూపరింటెండెంట్‌ పరిధిలో పనిచేయడానికి ఏమాత్రం ఇష్టంగా లేరని తెలిసింది. బదిలీ ఉత్తర్వులు రాగానే ఆయన హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లినట్టు తెలిసింది. కరీంనగర్‌, హైదరాబాద్‌కు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నించనున్నారని తెలిసింది. కాగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా పరకాలకు చెందిన డాక్టర్‌ లలితాదేవిని ప్రభుత్వం నియమించింది. 2017 మే 11న అర్బన్‌ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వోగా బాధ్యతలు తీసుకున్న ఆమె కొంతకాలం జయశంకర్‌ జిల్లా చిట్యాలలో పనిచేశారు. ఆరు నెలల నుంచి అర్బన్‌ జిల్లా వైద్యఆరోగ్యశాఖ శిక్షణ విభాగం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. డాక్టర్‌ లలితాదేవి పూర్తిసమయాన్ని కేటాయిస్తే శాఖ గాడిన పడుతుందని అంటున్నారు.


త్వరలో సూపరింటెండెంట్ల బదిలీలు


ప్రస్తుతం అన్ని శాఖల్లో బదిలీలు సాగుతుండగా, ఎంజీఎం, సీకేఎం తదితర ఆసుపత్రుల సూపరింటెండెంట్లను కూడా మారుస్తారనే ప్రచారం సాగుతోంది. సీకేఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వ్యవహరశైలిపై వైద్యులు, ఉద్యోగులు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజల నుంచి ఇప్పటికే డీఎంఈకి ఫిర్యాదు చేరాయి. ఆయనతోపాటు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కూడా మారుస్తారన్న ప్రచారం సాగుతోంది.