మించితే.. ముంచుతాయి

మహిళలు ఆరోగ్యం


పెయిన్‌కిల్లర్లతో తస్మాత్‌ జాగ్రత్త



పిల్లాడికి చిన్న దెబ్బతగిలినా... పెద్ద ఆస్పత్రిలో చూపించాలనుకుంటుంది తల్లి. భర్తకు కొంచెం ఒళ్లు వెచ్చబడినా... డాక్టర్‌ దగ్గరకు వెళ్లేదాకా పట్టుపడుతుంది భార్య. పెద్దవాళ్లకు ఆరోగ్యం బాగోలేకపోయినా... నయం చేయడానికి ఏవో తంటాలు పడుతుంది.


ఇలా అందరి బాగోగులు పట్టించుకునే ఇల్లాలు... తనకు కాలు నొప్ఫో.. నడుం నొప్ఫో.. చెవి నొప్పో కలిగితే మాత్రం ఏదో మాత్ర మింగేస్తుంది.. తగ్గిపోతుందిలే కదాని తెలిసిన మందులు వేసేసుకుంటుంది... నొప్పి నివారణ మందులు వేసుకునే ముందు ఒక్క క్షణం ఆగండి... ఆలోచించండి.


మందు ఎంత మంచిదైనా అవసరమైతేనే వాడుకోవాలి. నొప్పి మాత్రల విషయంలో దీన్ని ఏమాత్రం విస్మరించటానికి లేదు. అనవసరంగా, అదేపనిగా, చీటికీ మాటికీ వాడుతుంటే తీవ్ర అనర్థాలు తప్పవు.


పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రోజంతా ఉరుకులు పరుగులు. ఇంటిపనులు, వంటావార్ఫు పిల్లలబాధ్యతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఊపిరి సలపనీయకుండా ఎన్నో పనులు. ఎన్నెన్నో సమస్యలు. అయినా ఎవరినీ నొప్పించకుండా ఇంటిల్లిపాది అవసరాలను కనిపెట్టుకోవటానికి గృహిణులు పడే ‘శ్రమ’ అంతా ఇంతా కాదు. తాము ‘నొచ్చుకున్నా’ కప్పిపుచ్చుకోవటానికే ప్రయత్నిస్తారు. తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఎముకల నొప్పులు.. తలెత్తినా పెద్దగా పట్టించుకోరు. ఏదో ఒక నొప్పి మాత్ర వేసుకొని తిరిగి పనుల్లో మునిగిపోతుంటారు. ఎప్పుడో అప్పుడు నొప్పి మాత్రలు వేసుకోవటం పెద్ద ఇబ్బంది కలిగించకపోవచ్ఛు చీటికీ మాటికీ నొప్పి మాత్రలను ఆశ్రయిస్తుంటే మాత్రం ముప్పు తప్పదు. అప్పటికి నొప్పి తగ్గినా భవిష్యత్తులో ఎన్నో దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది.


నొప్పి ఒక జబ్బు కాదు. ఒక సంకేతం. కండరాలు ఒత్తిడికి లోనైనా, అధిక శ్రమకు గురైనా, ఇన్‌ఫెక్షన్లు తలెత్తినా, దెబ్బలు తగిలినా, బెణికినా.. నొప్పులు పుట్టొచ్ఛు ఇవి ఒకరకంగా మనల్ని ఆయా సమస్యల గురించి హెచ్చరించేవే. చాలావరకు విశ్రాంతి తీసుకుంటేనే తగ్గిపోవచ్ఛు కానీ రోజువారీ పనుల ఒత్తిళ్లతోనో, ఉద్యోగాల పేరుతోనో తక్షణ ఉపశమనం కోసం నొప్పి మందులను ఆశ్రయిస్తుంటాం. ఐబూప్రొఫెన్‌, డైక్లోఫెనాక్‌ సోడియం వంటి నాన్‌ స్టిరాయిడల్‌ రకం నొప్పి మందులను (ఎన్‌ఎస్‌ఐడీలు) అవసరమైనప్పుడు, నిర్ణీత మోతాదులో వాడుకోవటంలో తప్పులేదు. కానీ మనకు అవసరముందో లేదో తెలుసుకోకుండా, చీటికీ మాటికీ.. అదీ డాక్టర్‌ సలహా లేకుండా వేసుకునేవారే ఎక్కువ. అప్పటి మందులే ఇప్పుడూ పనిచేస్తాయని తీసుకోకూడదు. నొప్పి మందులన్నీ ఒకటే కావు. ఆయా నొప్పులను బట్టి డాక్టర్లు మందులను సూచిస్తారు. పైగా ఇప్పుడు అంత మోతాదు అవసరం ఉండకపోవచ్ఛు కొందరు నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవటానికీ మాత్రలు వేసుకుంటుంటారు. నెలలో ఏడు రోజుల వరకు వాడేేవారూ లేకపోలేదు.




ఛాతీ మంట


నొప్పి మాత్రలు ఆమ్లం ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో జీర్ణాశయం లోపలి గోడ దెబ్బతిని ఛాతీలో మంట, కడుపునొప్పి తలెత్తొచ్ఛు కొందరికి జీర్ణాశయంలో, పేగుల్లో పుండ్లు పడొచ్ఛు ఇవి రక్తస్రావానికి దారితీయొచ్ఛు నొప్పి మాత్రలు వేసుకుంటున్నప్పుడు కడుపునొప్పి, మలంలో రక్తం, మలం నల్లగా ఉండటం, రక్తం వాంతుల వంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొందరికి మలబద్ధకం, విరేచనాలూ పట్టుకోవచ్ఛు చాలామంది వీటిని నొప్పి మాత్రల దుష్ప్రభావాలుగా గుర్తించరు.




గుండెపోటు, పక్షవాతం


గుండెజబ్బులు, అధిక రక్తపోటు గలవారు నొప్పి మాత్రల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటితో గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరగొచ్ఛు గుండెజబ్బులు గలవారికి డాక్టర్లు రక్తాన్ని పలుచగా చేసే ఆస్ప్రిన్‌ను వేసుకోవాలని సూచిస్తుంటారు. వీరికి నొప్పి మాత్రలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి.




కిడ్నీలకు విఘాతం


కిడ్నీలకు వెళ్లే రక్తనాళాలు వెడల్పు కావటానికి తోడ్పడే ప్రోస్టాగ్లాండిన్లను నొప్పి మాత్రలు అడ్డుకుంటాయి. దీంతో కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా ఆక్సిజన్‌ తగ్గిపోయి కిడ్నీల పనితీరు దెబ్బతినొచ్ఛు




కాలేయానికి దెబ్బ


పారాసిటమాల్‌ వంటి మామూలు మాత్రలూ మోతాదు మితిమీరితే కాలేయం దెబ్బతినొచ్ఛు అప్పటికే హెపటైటిస్‌ వంటి కాలేయ జబ్బులు గలవారికి మరింత ప్రమాదకరకంగా పరిణమించొచ్ఛు




రకరకాల అనర్థాలు


నొప్పి మాత్రలు తక్కువ సమయానికి వాడుకోవటానికి ఉద్దేశించినవి. ఇవి నొప్పికి దారితీసే ఎంజైమ్‌లను అడ్డుకోవటం ద్వారా ఉపశమనం కలిగిస్తాయి. వీటిని అనవసరంగా, దీర్ఘకాలం వాడితే రకరకాల అనర్థాలు తలెత్తొచ్ఛు


● పిండం మీద దుష్ప్రభావం: గర్భిణులు నొప్పి మాత్రలు అసలే వేసుకోకూడదు. ఇవి పిండంలో మూత్రం ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీంతో ఉమ్మనీరు తగ్గిపోయి, రకరకాల సమస్యలకు దారితీయొచ్ఛు


● నీరసం: అదేపనిగా నొప్పి మాత్రలు వాడితే హిమోగ్లోబిన్‌ స్థాయులు పడిపోవచ్ఛు ఇది నీరసం, నిస్సత్తువకు దారితీస్తుంది.


● ఆస్థమా, ఫిట్స్‌: ఈ జబ్బులతో బాధపడేవారికి నొప్పి మాత్రలతో సమస్యలు ఉద్ధృతమయ్యే ప్రమాదముంది.



వ్యాయామం మీద దృష్టి పెట్టండి


శరీరాన్ని దృఢంగా ఉంచుకోగలిగితే ఒళ్లు, ఎముక నొప్పులను చాలావరకు నివారించుకోవచ్ఛు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. దీంతో పనులు చేస్తున్నప్పుడు కదలికలు తేలికగా సాగుతాయి. ‘ఇంటిపనులు చేస్తున్నాం కదా. ఇంకా వ్యాయామం ఎందుకు’ అని భావించటం తగదు. ఇంటిపనులతో శారీరక శ్రమ లభించినా అది సరిపడకపోవచ్ఛు ఒక క్రమ పద్ధతిలో, లయబద్ధమైన కదలికలతో చేసే వ్యాయామం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు శరీర భంగిమ దెబ్బతినకుండా చూసుకోవాలి. అలాగే వేళకు భోజనం చేయాలి, అన్ని పోషకాలు లభించేలా చూసుకోవాలి.


- డా.పి.బాలాంబ సీనియర్‌ గైనకాలజిస్ట్‌