సిద్దిపేట,(ఆరోగ్యజ్యోతి) : కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలను పణంగా పెట్టి సైనికుల్లా ప్రజలను కాపాడుతున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బంది సమాజంలో విలువైన గౌరవాన్ని పొందుతున్నట్టు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో గురువారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతోపాటు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నుంచి పునఃర్జన్మ ప్రసాదిస్తున్న ప్రజా సేవకులను ప్రభుత్వం కూడా గుర్తిస్తుందన్నారు. ఈ మూడు శాఖల సిబ్బందికి వందశాతం వేతనంతోపాటు నెలకు రూ.130 కోట్లు ప్రోత్సాహకం ఇస్తున్నట్లు చెప్పారు. లాక్డౌన్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రజల కోసం పనిచేస్తున్న ఈ మూడు శాఖల సిబ్బందికి ప్రోత్సాహకం మాత్రం తప్పక ఇస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రతాప్రెడ్డి, భూపతిరెడ్డి పాల్గొన్నారు.