ఆపదలో ఆదుకుందాం

మెదక్‌, (ఆరోగ్యజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారిని అన్నిరకాలుగా      ఆదుకుందామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలో పలుచోట్ల నిర్వహించిన సహాయ కార్యక్రమాల్లో పాల్గొని సరుకులు పంపిణీ చేశారు.  సాయి బాలాజీ గార్డెన్‌ నాయీ బ్రాహ్మణులకు, ద్వారకా గార్డెన్‌లో పాస్టర్లకు మంత్రి  నిత్యావసర వస్తువులు  అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ వలస కూలీలతో సహా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఆదుకోవాలని సూచించారు. మెదక్‌ జిల్లాలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకొని కరోనాను సమర్థవంతంగా నియంత్రిం చారన్నారు. లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. మాస్కులు లేకుండా ప్రజలు బయటకు రావొద్దని, శుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు స్వీయనియంత్రణ పాటించి ఇండ్ల నుండి ప్రజలు బయటకు రావొద్దని, మరికొద్ది రోజులు ఓపికగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు సంతోషాన్నిస్తున్నాయని, పేదవారి పై ముఖ్యమంత్రి ఉదారతతో వ్యవహరించి రూ.1500, ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌ రెడ్డితో పాటు సింగిల్‌ విండో చైర్మన్‌ హనుమంత్‌ రెడ్డి, కౌన్సిలర్లు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పోలీస్‌ అధికారులకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. అంతకు ముందు చిన్నశంకరంపేటలోని శ్రీనివాస గార్డెన్‌లో గ్రామ పంచాయతీ కార్మికులకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలు నిత్యావసర వస్తువులు,  శానిటైజర్లను పంపిణీ చేశారు.  వడియారం బైపాస్‌ రోడ్డుపై మంత్రి హరీశ్‌రావు కారును ఆపి అక్కడ వలస కార్మికులకు పంపిణీ చేస్తున్న ఆహారాన్ని పరిశీలించి దాతలను అభినందించారు. అనంతరం రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌, మండల పార్టీ అధ్యక్షుడు పల్లె జితేందర్‌గౌడ్‌ సీఎం కేసీఆర్‌ చిత్రపటంతో ఉన్న వెయ్యి గులాబీ మాస్క్‌లు మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు.  నర్సాపూర్‌తో పాటు కొల్చారం, కౌడిపల్లి మండలాల్లో పేద ప్రజలకు, ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,  స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి,మాజీ మంత్రి సునీతారెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు.