న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గురించి చైనాకు గతేడాది నవంబర్ ప్రారంభంలోనే తెలుసునని.. కానీ, ఆ వివరాలను ప్రపంచానికి వెల్లడించలేదని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. దీనివల్లే ప్రపంచ దేశాలన్నీ కరోనా ప్రమాదాన్ని గుర్తించడంలో వెనుకబడ్డాయన్నారు. చైనా వైఖరి ఎంతమాత్రం బాగాలేదని, భవిష్యత్తులో ఆ దేశం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ప్రపంచ దేశాలన్నీ కరోనాపై పోరులో నిమగ్నమై ఉంటే.. చైనా మాత్రం దక్షిణ సముద్రంలో తన విస్తరణ ఎజెండాను ముందుకు తీసుకెళ్లున్నదని పాంపియో పేర్కొన్నారు. సైనిక నౌకలను మోహరించి.. గ్యాస్, చమురు నిక్షేపాల ప్రాజెక్టులు చేపట్టిన ఇతర దేశాలను బెదిరింపులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. ఆగ్నేయాసియా దేశాల విదేశాంగమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.