ముఖానికి మాస్క్లు ధరించడం మన జీవితాల్లో భాగమైనట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ ఆయన మన్కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడారు. మాస్క్లు ధరించిన వారిని రోగులుగా చూడకూడదని, నాగరిక సమాజానికి మాస్క్లు చిహ్నంగా మారాయన్నారు. మనల్ని మనం రక్షించుకోవాలన్నా, లేక ఇతరుల్ని వ్యాధి నుంచి కాపాడాలన్నా.. మాస్క్లు ధరించడం చాలా ముఖ్యమన్నారు. బహిరంగ స్థలాల్లో ఉమ్మివేస్తే కలిగే అనర్ధాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని మోదీ అన్నారు. ఇలాంటి అలవాటును ఆపాల్సిన సందర్భం వచ్చిందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే అలవాటును మానేసే తరుణం ఆసన్నమైందన్నారు. కోవిడ్19 మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూపిన చొరవను ప్రధాని మెచ్చుకున్నారు.
కరోనా వైరస్పై భారత్లో జరుగుతున్నది ప్రజాపోరాటం అన్నారు. ప్రజలు, ప్రభుత్వాధికారులు కలిసికట్టుగా వైరస్పై పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక పౌరుడు.. సైనికుడిలా వైరస్ఫై యుద్ధం చేస్తున్నారన్నారు. కరోనా సంక్షోభ వేళ రైతులు మాత్రం నిర్విరామంగా పనిచేస్తున్నారన్నారు. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఉండేందుకు రైతులు శ్రమిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి వారి సామర్థ్యానికి తగినట్లు పోరాడుతున్నారన్నారు. కొందరు ఇంటి కిరాయిలను మాఫీ చేస్తున్నారని, క్వారెంటైన్లో ఉన్న వాళ్లు స్కూళ్లకు రంగలు అద్దుతున్నారన్నారు.
కోవిడ్ వారియర్స్ అనే డిజిటల్ ఫ్లాట్ఫామ్ను క్రియేట్ చేశామని, ఎన్జీవోలు, స్థానిక ప్రభుత్వాలు దాంట్లో భాగమైనట్లు చెప్పారు. డాక్టర్లు, నర్సులు, ఎన్సీసీ క్యాడెట్లు కూడా దాంట్లో జతకలిశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతి శాఖ, సంస్థలు అన్నీ.. వీలైనంత త్వరగా కోలుకునేందుకు కలిసి పనిచేస్తున్నాయన్నారు.