టీబీని నిర్లక్ష్యం చేయొద్దు: తమిళిసై

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): కోవిడ్‌లో పడి టీబీని నిర్లక్ష్యం చేయరాదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌తో పోల్చుకుంటే టీబీ రోగుల పరిస్థితి చాలా క్లిష్టమైందని, ఈ రెండూ ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటాయన్నారు. ఎప్పటికప్పుడు టీబీ రోగులను గుర్తిస్తూ...వారికి తగిన పౌష్టికాహారం, విటమిన్‌ సప్లిమెంట్లు అందించేలా చూడాలని, అవసరమైతే ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారం తీసుకోవాలన్నారు. గురువారం ఆమె రాజ్‌భవన్‌ నుంచి టీబీ నియంత్రణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రోగులకు మందుల లభ్యత, కొత్త కేసులపై గవర్నర్‌ ఆరా తీశారు. టీబీ రోగుల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.