అక్క‌డ ఆరోగ్య సేతు యాప్ ఉండాల్సిందే..!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ లాక్‌డౌన్ ను మ‌రింత క‌ట్టుదిట్టంగా అమ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోకి రావాలంటే ఆరోగ్య సేతు యాప్‌ కంపల్సరీగా డౌన్‌లోడ్‌ చేసుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌భుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారానైనా ప్ర‌జ‌లు  అప్రమత్తమై కరోనా వ్యాప్తిని అరికట్టగలమని భావిస్తున్నారు. కరోనా అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ తీసుకువ‌చ్చింది. క‌రోనా గురించి ఇది అల‌ర్ట్ చేయ‌డంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కేసులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలు గురించి దీంట్లో ఉంటాయి. కాగా దేశ‌వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 75 మిలియన్ల మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.