బీజింగ్: ‘భారతీయులు మానసికంగా గట్టివారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి వారికి శారీరకంగా వ్యాధినిరోధకశక్తి లేకున్నా మానసికంగా తట్టుకొనే సామర్ధ్యం ఉన్నది. అందుకే కరోనా వైరస్ను ధీటుగా ఎదుర్కొంటున్నారు’ అని చైనాకు చెందిన వైద్యనిపుణుడు జాంగ్ వెన్హాంగ్ చెప్పారు. భారత్లో కొందరు మాస్క్లు ధరించకుండానే ఒక మతానికి సంబంధించిన సమావేశానికి హాజరవడం మీడియాలో తాను చూశానని, దీంతో భారతీయులకు కొవిడ్-19ను ఎదుర్కొనే మానసిక సామర్ధ్యం ఎక్కువగా ఉన్నదన్న విషయం అర్థమైందని భారత్లోని చైనా విద్యార్థులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. షాంఘైలోని హుషాన్ దవాఖానలో అంటువ్యాధు విభాగం డైరెక్టర్గా జాంగ్ వెన్హాంగ్ ఉన్నారు. భారత్లో వైరస్ వ్యాప్తి వేగంగా చోటుచేసుకొంటున్నా.. అది సోకే వారి సంఖ్య 10 శాతానికి మించదని అన్నారు.