పెళ్లిబాజాలు వినపడేదెప్పుడో!


ఏప్రిల్‌, మేలో వేలాది పెళ్లిళ్లు వాయిదా.. ఆగస్టుపైనే ఆశలన్నీ..!




(ఆరోగ్యజ్యోతి- డెస్క్ ): వేసవి వచ్చిందంటే చాలు.. పెళ్లి బాజాలతో పల్లెలు, పట్టణాలు హోరెత్తిపోతుంటాయి. మంగళవాయిద్యాలు, బంధువుల రాకపోకలతో ఊళ్లన్నీ కొత్త అందాలు అద్దుకుంటాయి. కానీ కరోనా మహమ్మారి దెబ్బకు ఈ ఏడాది ఆ ముచ్చట్లన్నీ బంద్‌ అయ్యాయి. ఈ నెల, వచ్చే నెలల్లో జరగాల్సిన వేలాది పెళ్లిళ్లు, ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు మాత్రం.. అటువైపు, ఇటువైపు కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో సాదాసీదాగా కళ్యాణాలు కానిచ్చేస్తున్నారు. వైభవంగా పెళ్లి జరుపుదామనుకున్న తల్లిదండ్రుల ఆశలపై ప్రభుత్వ నిబంధనలు నీళ్లు చల్లేశాయి. దీంతో.. ముహూర్తాలను చాలామంది నవంబరుకు వాయిదా వేసుకున్నారు. 


విదేశాల్లో ఉంటే కష్టమే


అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ స్వదేశంలో ఉంటే, జూలై, ఆగస్టుల్లో నిబంధనలు సడలిస్తే.. పెళ్లి జరిగేందుకు అవకాశముంది. కానీ.. వధూవరుల్లో ఏ ఒక్కరు విదేశాల్లో ఉన్నా.. శ్రావణంలో కూడా వివాహం జరుపుకోలేమోమో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు ఎన్నారై పిల్లల తల్లిదండ్రులు నవంబర్‌కు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అయితే అప్పటికైనా సాధ్యమవుతుందా? అనే సందేహాలున్నాయి. ఇక.. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందని, దీంతో ఈ ఏడాది చివరి వరకూ భారీ పెళ్లిళ్ల అవకాశం ఉండదని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.