న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు సగటున 9.1 రోజులకు రెట్టింపు అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు కొత్త కేసుల వృద్ధిరేటు 6 శాతంగా ఉన్నదని తెలిపింది. దేశం లో కేసులు 100 దాటిన తర్వాత రోజువారీ వృద్ధిరేటు ఇంత తక్కువగా ఉండడం ఇదే తొలిసారి అని పేర్కొం ది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో అత్యున్నత మంత్రివర్గ కమిటీ (జీవోఎం) శనివారం సమావేశమైంది. రాష్ర్టాలవారీగా కరోనా దవాఖానలు, ఐసొలేషన్ బెడ్లు, వార్డులు, పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్లు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఇతర సదుపాయాలపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. దేశీయ తయారీ సంస్థలు ఇప్పటికీ పీపీఈ కిట్లు, మాస్క్లను తయారీచేస్తున్నాయని, ప్రస్తుతం అవి సరిపడా అందుబాటులో ఉన్నాయని జీవోఎంకు తెలియజేసినట్లు పేర్కొం ది. ‘ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షకుపైగా పీపీఈ కిట్లు, మాస్క్లు తయారవుతున్నాయి. 104 సంస్థలు పీపీఈ కిట్లను, మూడు సంస్థలు ఎన్95 మాస్క్లను తయారుచేస్తున్నాయి. దేశీయ సంస్థలు ఇప్పటికే వెంటిలేటర్ల తయారీని ప్రారంభించాయి. 59,000 యూనిట్ల తయారీకి ఆరు సంస్థలకు ఆర్డర్లు ఇచ్చాం’ అని కేంద్ర వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మరణాల రేటు 3.1 శాతం, రికవరీ రేటు 20 శాతం..
ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 3.1 శాతం ఉండగా, రికవరీ రేటు 20 శాతానికిపైగా ఉన్నట్లు వైద్య శాఖ వెల్లడించింది. లాక్డౌన్తోపాటు క్లస్టర్ మేనేజ్మెంట్, కంటైన్మెంట్ స్ట్రాటజీ వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. దేశంలో కొత్తగా 1490 కేసులు నమోదయ్యాయని, 56 మంది మృత్యువాతపడ్డారని వివరించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,942కు చేరుకుందని, మృతుల సంఖ్య 779కి పెరిగిందని తెలిపింది. అయితే, పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 26,194కు చేరుకోగా, మృతుల సంఖ్య 824కు పెరిగింది.