న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి) : దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించే ముందు ‘ఆరోగ్య సేతు’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందేనన్న కఠిన నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోకి ప్రవేశించే వారందరు కూడా కేంద్రం ప్రతిపాదించిన ‘ఆరోగ్య సేతు’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందేనని కఠిన నిబంధన విధించనున్నట్లు సమాచారం. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఇప్పటికే సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికే ఢిల్లీలో ప్రవేశం కల్పించాలని ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుర్జీత్ కుమార్ ఢిల్లీ ప్రభుత్వానికి సూచించారు. అయితే ఇప్పటి వరకైతే దీనిపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోనప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఈ దిశగానే ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారానైనా కొంతలో కొంత కోవిడ్ - 19 వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.