నర్సు యూనిఫాంలో హాస్పిటల్ సందర్శించిన ముంబై మేయర్

ముంబై, (ఆరోగ్యజ్యోతి):ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ సోమవారం నర్సు యూనిఫాంలో ఆస్పత్రికి వచ్చి వైద్య సిబ్బందికి ఉత్సాహం కలిగించారు. బృహన్‌‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నడుపుతున్న బీవైఎల్ నాయర్ హాస్పిటల్‌కు సోమవారం ఉదయం ఆమె వచ్చారు. ఇదివరకు నర్సుగా పనిచేసిన పెడ్నేకర్ హాస్పిటల్ సిబ్బందిని కలిసి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. మేయర్ తన హాస్పిటల్ సందర్శన సందర్భంగా సామాజిక దూరాన్ని పాటించారని బీఎంసీ అధికారులు చెప్పారు. 'నేనూ గతంలో నర్సుగా పనిచేశాను. ఈ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు. నేనూ మీలో ఒకరినని నర్సింగ్ సిబ్బందికి దైర్యం చెప్పేందుకే ఇలా నర్సు యూనిఫాంలో వచ్చాను. మహమ్మారిని ఎదుర్కోవడంలో నర్సింగ్ సిబ్బంది చేస్తున్న వీరోచిత పోరాటంలో వారిని ప్రోత్సహించేందుకు ఇలా చేశాను. ఇవి గడ్డురోజులు. మనమంతా ఒకరికొరు తోడుగా నిలిచి ఈ పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంది' అని మేయర్ పెడ్నేకర్ మీడియాతో అన్నారు. ఓ మిల్లు కార్మికుని కూతురైన పెడ్నేకర్ నర్సు వృత్తిని వదిలిపెట్టి 1992లో శివసేన మహిళా విభాగంలో చేరారు. రాయిగడ్, సింధుదుర్గ్ జిల్లాల్లో ఆమె శివసేన తరఫున పనిచేశారు. 2002, 2012, 2017లో ఆమె బీఎంసీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 53 మంది జర్నలిస్టులకు ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఆమె తనకుతాను క్వారంటైన్ విధించుకున్నారు. కానీ కోరనా నెగెటివ్ రావడంతో అధికారిక విధుల కోసం మేయర్ పెడ్నేకర్ బయటకు రాక తప్పలేదు.