కుటుంబంలోని ఐదుగురు మృతి

ల‌క్నో :  ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌ శ్రీన‌గ‌ర్‌లో కాలనీలోని ఇతాహ్‌లో చోటుచేసుకుంది.  మృతుల‌ను  వైద్య శాఖలో క్లర్క్‌గా పని చేసి రిటైరైన రాజేశ్వర్ పచౌరీ(75)తో పాటు అతని కుటుంబసభ్యులు దివ్య పచౌరీ(33), బాబుల్(25), దివ్య కుమారులు ఆరుశ్(10), లాలూ(1)గా గుర్తించారు. మృతుల‌లో దివ్య శ‌రీరంపై గాయాలు ఉన్న‌ట్లు గుర్తించిన‌ట్టు పోలీసులు తెలిపారు. వీరి మరణానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంద‌ని అన్నారు.మృతదేహాల పక్కన టాయిలట్ క్లీనర్‌తో పాటు.. విషం కూడా లభించిందని పోలీసులు తెలిపారు. ఉదయం పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి ఎంత‌సేపు త‌లుపుకొట్టినా తీయ‌క‌పోవ‌డంతో ఇంటి పక్క‌న వారికి స‌మాచారం అందించాడు. వారు పోలీసులకు విషయం చెప్పడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించామని, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి బంధువులకు సమాచారం అందించామని పోలీసులు పేర్కొన్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.