హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో కరోనా వైరస్ వ్యాప్తికి ఆస్కారం ఉంటుందని గాంధీ మెడికల్కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్సుందర్రాజు తెలిపారు. కోవిడ్-19 పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పలువురు ప్రముఖ వైద్యులు మాట్లాడారు. ఈసందర్భంగా డాక్టర్ శ్యామ్సుందర్రాజు మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్తో వ్యాప్తిని చాలా వరకు అరికట్టగలుగుతున్నామని తెలిపారు. వైరస్ తగ్గాలంటే సోషల్ ప్రివెంటివ్ మెఽధడ్స్ , మెడికేషన్, వ్యాక్సినేషన్ లాంటి మార్గాలు ఉన్నాయని అన్నారు. సోషల్ ప్రివెంటివ్ మెథడ్స్లో భౌతిక దూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం, లాక్డౌన్ , మాస్క్లను ధరించడం వంటివి సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. వ్యాక్సినేషన్కు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. కేర్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ నవోదయ్ మాట్లాడుతూ చలి కాలంలో ఫ్లూ లాంటి లక్షణాలతో కరోనా కూడా వస్తుందన్నారు. ముఖ్యంగా భౌతిక దూరాన్ని పాటిస్తూనే చేతులను శుభ్రపరచడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించి డాక్టర్ సలహా తీసుకోవాలన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు జింక్, ఐరన్, సెలీనియం, విటమిన్ ఎ,డి,ఈ, సి ఉన్నఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలని సూచించారు. తక్కువ నూనెలను వాడుతూ ఎక్కువ మంచినీటిని తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సరిపడా నిద్రపోవాలన్నారు వయసు పై బడిన వాళ్లు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేడి నీటితో గర్లింగ్ చేయాలన్నారు. సరుకులను బయట నుంచి తీసుకు వచ్చినప్పుడు వాటిని కడిగి , కొంత సేపు బయట పెట్టి వాడుకోవాలన్నారు. ప్రజలు లాక్డౌన్ను తప్పక పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్ జగన్, ఇన్చార్జి ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ విజయభాస్కరరెడ్డి, అసిస్టెంట్డైరెక్టర్ యామిని తదితరులు పాల్గొన్నారు.