ఆ మూడు రాష్ట్రాల వారిని రానివ్వం

బెంగళూరు: రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారిని  ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని కర్ణాటక ప్రభుత్వం  స్పష్టంచేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని, ఆయా సమయాలను బట్టి అప్పటి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల విజ్ఞప్తిమేరకు రాష్ట్రంలోకి రానిచ్చే విషయంపై ఆలోచిస్తామన్నారు. ఇదే సమయంలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రజలను రానిస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే సేవా సింధు పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకొన్నవారికి, రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి పాసులు పొందినవారిని ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రంలోకి రానిస్తామని చెప్పారు. ఇలాఉండగా, సోమవారం నాటికి కర్ణాటక వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. మహారాష్ట్ర నుంచి 49,935 మంది, తమిళనాడు నుంచి 17,756 మంది, గుజరాత్‌ నుంచి 2,563 మంది కర్ణాటక వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో దాదాపు 70 శాతం పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నందున ఈలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వైద్యశాఖ మంత్రి కే సుధాకర్‌ చెప్పారు