ఒక్కరోజే కోలుకున్నవారు 1,074

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధికంగా 1,074 మంది రోగులు కొవిడ్‌-19 నుంచి కోలుకొన్నారని, ఒక్కరోజులో ఇంత ఎక్కువమంది కోలుకోవడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ సోమవారం వెల్లడించారు. దేశంలోని కొవిడ్‌-19 రోగుల్లో ఇప్పటివరకు మొత్తం 11,706 మంది కోలుకొన్నారని, ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 27.52 శాతంగా ఉన్నదని చెప్పారు. గత 24 గంటల్లో కొత్తగా 2,553 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కు చేరిందని తెలిపారు. ప్రస్తుతానికి కొవిడ్‌-19 కర్వ్‌ ఫ్లాట్‌గా (సమాంతర రేఖలా) ఉన్నదని, ఇది పైకి ఎగబాకుతుందని మాట్లాడటం సరికాదని అన్నారు.