న్యూఢిల్లీ: దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య గురువారానికి 1,075కు చేరుకోగా కేసుల సంఖ్య 33,610కు పెరిగింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 67 మంది చనిపోగా కొత్తగా 1,823 కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 24,162 కాగా 8,372 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన జాబితాలో మహారాష్ట్రలో 32 మంది, గుజరాత్ 16, మధ్యప్రదేశ్ 11, ఉత్తరప్రదేశ్లో ముగ్గురు, తమిళనాడు, ఢిల్లీల నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 432 మంది, గుజరాత్లో 197 మంది, మధ్యప్రదేశ్లో 130, ఢిల్లీలో 56 మంది, రాజస్తాన్లో 51 మంది, ఉత్తరప్రదేశ్లో 39 మంది, తమిళనాడులో 27 మంది, బెంగాల్లో 22 మంది, కర్ణాటకలో 21 మంది, పంజాబ్లో 19 మంది చనిపోయారు.