హైదరాబాద్: లాక్ డౌన్ తో రాష్ట్రంలో చిక్కుకున్న కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో సొంతూళ్లకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. కార్మికులు అర్థాకలితో అలమటించకుండా వారికి అవసరమైన ఆహారసామాగ్రి నిత్యవసర సరుకులు అందజేస్తోన్న విషయం తెలిసిందే. వలస కార్మికులకు తనవంతుగా సాయం చేయడానికి ‘త్రిపుర’ చిత్ర నిర్మాత ఎం రాజశేఖర్ రెడ్డి ముందుకొచ్చారు. వలస కార్మికులు కాలినడకన, లారీల్లో ఇతర మార్గాల్లో సొంతూళ్లకు వెళ్లే వారిని చూసిన నిర్మాత యం.రాజశేఖర్ రెడ్డి ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. సోమవారం ఒరిస్సా, చత్తీస్గడ్ వెళ్లేవారికోసం 400 ప్యాకెట్ల పులిహోర, బిస్కట్స్, మంచినీళ్లు, చెప్పులు, మెడిసిన్ అందజేశారు. మంగళ, బుధవారాల్లో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర వెళ్లే వారికోసం దాదాపు 600 ప్యాకెట్ల టమాట రైస్ తయారు చేయించారు. సొంతూరు వెళ్లేందుకు డబ్బులు లేనివారికి ఛార్జీల కోసం 40000 రూపాయలను అందజేశారు. లాక్డౌన్ సమయంలో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.5లక్షలు, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 5లక్షలు అందించిన రాజశేఖర్రెడ్డి.. వలస కార్మికుల కోసం మరో లక్ష రూపాయలను ఖర్చు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. రాజశేఖర్ ‘కేరాఫ్ కంచెరపాలెం’ను తమిళంలో ‘కేరాఫ్ కాదల్’గా తీశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆది పినిశెట్టి హీరోగా ‘క్లాప్’ చిత్రాన్ని తమిళ్, తెలుగులో నిర్మిస్తున్నారు.