ఒకే స్టేష‌న్‌లోని 12 మంది పోలీసుల‌కు క‌రోనా

ముంబై: మ‌హాన‌గ‌రం ముంబైలోని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లతో సహా 12 మంది పోలీసులకు కరోనావైరస్ సోకినట్లు గుర్తించారు. అధికారులు తెలియ‌జేసిన వివరాల ప్ర‌కారం క‌రోనా సోకిన వారితో సంప్రదింపులు జరిపిన 40 మందిని ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉంచారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవినాష్ ధర్మాధికారి మాట్లాడుతూ 12 మంది పోలీసులలో ఇన్ఫెక్షన్ క‌నిపించింద‌న్నారు. కాగా జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ ప్రభుత్వ జ‌జే ఆసుపత్రి ప‌క్కనే ఉంది. ఇదిలావుండ‌గా పైధుని పోలీస్ స్టేషన్‌కు చెందిన‌  ఆరుగురు పోలీసులు, నాగ్పాడాలో ముగ్గురు, మహీమ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన‌ ఇద్దరు పోలీసులకు కూడా క‌రోనా సోకింది. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మహారాష్ట్రలో నలుగురు పోలీసులు మరణించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 35 మంది మరణించారు. ప్ర‌స్తుతం మహారాష్ట్రలో కరోనా బారిన పడిన రోగుల సంఖ్య 14541 కు చేరింది. ముంబైలో మాత్రమే 9 వేలకు పైగా కేసులు ఉన్నాయి. కరోనా నుండి ఇప్పటివరకు మ‌హారాష్ట్ర‌లో 583 మంది మరణించారు.