ముంబై,(ఆరోగ్యజ్యోతి): దేశంలో లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ కరోనా ప్రభావం తగ్గు ముఖం పట్టడం లేదు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా రోజురోజుకూ ప్రభావాన్ని చూపుతోంది. మహారాష్ట్రలో బుధవారం కొత్తగా 1233 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ మహారాష్ట్రలో ఒకేరోజు ఈ స్థాయిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. బుధవారం 34 కరోనా మరణాలు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,758కి చేరింది. మహరాష్ట్రలో ఇప్పటివరకూ 651 మంది కరోనా బారిన పడి మరణించారు.ఇక.. మహారాష్ట్ర తర్వాత దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం గుజరాత్. గుజరాత్లో బుధవారం ఒక్కరోజే కొత్తగా 380 కరోనా కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. దీంతో.. గుజరాత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,625కు చేరింది. గుజరాత్లో ఇప్పటివరకూ 396 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. గుజరాత్లో వెలుగుచూస్తున్న కేసుల్లో అహ్మదాబాద్లోనే ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం.