న్యూఢిల్లీ : వలస కార్మికుల కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఎర్రటి ఎండలో కాళ్లకు బొబ్బలు వచ్చినప్పటికీ.. తమ గమ్యస్థానం చేరేందుకు కాలినడక కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కాలినడకలో వలస కార్మికుల కష్టాలు అన్నీఇన్ని కావు. ఆకలితో అలమటిస్తూ.. వేల కిలోమీటర్లు నడక సాగిస్తున్నారు. కొంతమంది వలస కార్మికుల బాధలు అయితే గుండెల్ని పిండేస్తున్నాయి.మధ్యప్రదేశ్లోని సింగ్రౌలికి చెందిన ఓ కుటుంబం.. పంజాబ్లోని లుధియానాకు వెళ్లింది. లాక్డౌన్ కారణంగా వారికి ఉపాధి లేకపోవడంతో.. సొంతూరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ కుటుంబంలోని ఓ అబ్బాయికి మెడ భాగంలో గాయం కావడంతో.. నడవలేడు. మరి ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు.. ఓ మంచాన్ని కావడిలా మార్చారు. మంచంపై బాలుడిని పడుకోబెట్టి.. సుమారు 1300 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు.