కోవిడ్‌-19 పాజిటివ్‌తో హోటల్‌ పరిసరాలు సీల్‌



ఢిల్లీ : ఢిల్లీలోని ఓ హోటల్‌ పరిసరాలను అధికారులు సీల్‌ చేశారు. ఎయిర్‌ ఇండియా సిబ్బందికి సదరు హోటల్‌లో కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా పరీక్షలు చేయించుకున్న వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నియమాల ప్రకారం హోటల్‌ పరిసరాలను సీల్‌ చేశారు. అనంతరం శానిటైజేషన్‌ను చేపట్టనున్నారు. నేషనల్‌ క్యారియర్‌ ఎయిర్‌ ఇండియా ప్రధాన కార్యాలయం సైతం రెండు రోజుల పాటు బంద్‌ అయిన విషయం తెలిసిందే. వాణిజ్య విభాగంలో ఓ ఉద్యోగికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో మంగళవారం నాడు కార్యాలయాన్ని సీల్‌ చేశారు. అదేవిధంగా ముంబయికి చెందిన ఐదుగురు పైలట్లు ఇటీవల కోవిడ్‌-19 భారిన పడ్డారు. రెండో నిర్వహించిన పరీక్షలో వీరికి నెగెటీవ్‌గా తేలింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎయిర్‌ ఇండియా సిబ్బంది ఎవరైనా విధుల్లో చేరేముందు తప్పనిసరిగా కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాల్సిందే.