భారత్‌లో కొవిడ్-19 అప్‌డేట్ వెల్లడిస్తూ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: భారత్‌లో రికవరీ రేటుపై కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. భారత్‌లో ఇప్పటివరకూ 42,298 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. ఇది కొంత సంతృప్తికర విషయమని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో 61,149 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు.ప్రపంచ మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే లక్ష మందిలో 62 మంది కరోనా బారిన పడ్డారని ఆయన చెప్పారు. అదే భారత్‌లో.. లక్షకు 8 మందికి మాత్రమే కరోనా సోకినట్లు తేలిందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. భారత్‌లో లాక్‌డౌన్ అమలైన కొత్తలో రికవరీ రేటు 7 శాతంగా  ఉందని.. అదే ఇప్పుడు 39.6 శాతానికి పెరిగిందని చెప్పారు. లాక్‌డౌన్ 1 నాటికి 7.1 శాతం, లాక్‌డౌన్ 2.0 నాటికి 11.42 శాతం, లాక్‌డౌన్ 3.0 నాటికి 26.59 శాతంగా ఉన్న రికవరీ రేటు లాక్‌డౌన్ 4.0 నాటికి 39.62 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ ప్రకటించారు.