హైదరాబాద్: ఈ నెల 29 వరకూ తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కొద్దిరోజులు ఓపికపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణలో టెస్టింగ్ కిట్ల కొరత లేదని చెప్పారు. రెడ్జోన్లో సిమెంట్, ఎలక్ట్రికల్, హార్డ్వేర్, స్టీల్ షాపులకు అనుమతి వ్యవసాయరంగ పనులు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా కనిపించని శత్రువని, ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కరోనాను జీరోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలందరూ లాక్డౌన్కు సహకరించాలని పిలుపునిచ్చారు. వివిధ జబ్బులతో చికిత్స పొందుతున్నవారు బయటకు రావొద్దని కేసీఆర్ సూచించారు. ‘‘తెలంగాణలో సూర్యాపేట, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ రెడ్జోన్లో ఉన్నాయి. యాదాద్రి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్, నాగర్కర్నూల్, పెద్దపల్లి గ్రీన్జోన్లో ఉన్నాయి. సంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, జయశంకర్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట, సిరిసిల్ల, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కుమ్రం భీం, నిర్మల్, గద్వాల ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఆరెంజ్ జోన్లోని కొన్ని జిల్లాలు ఇవాళ గ్రీన్ జోన్లోకి వెళ్లబోతున్నాయి. వచ్చే 18 రోజుల్లో చాలా జిల్లాలు గ్రీన్ జోన్లోకి వెళ్లబోతున్నాయి. హైదరాబాద్లో కేవలం 12 కంటైన్మెంట్ జోన్లు కాబోతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో రిస్క్ తీసుకోలేం. మొత్తం కేసుల్లో 726 కేసులు ఇక్కడే ఉన్నాయి. 29 మరణాల్లో 22 మంది జీహెచ్ఎంసీలోనే చనిపోయారు. నాలుగురోజుల నుంచి మొత్తం పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీలోనివే.’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.