కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. నోవెల్ కరోనా వైరస్ వల్ల దేశంలో మరణాల రేటు 3.3 శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రికవరీ రేటు కూడా 29.9 శాతానికి పెరిగినట్లు మంత్రి చెప్పారు. మనదేశానికి ఇవి మంచి సంకేతాలన్నారు. ఇక దేశంలో వైరస్ రెట్టింపు అవుతున్న రేటు గురించి కూడా ఆయన వెల్లడించారు. గత మూడు రోజుల్లో వైరస్ డబ్లింగ్ 11 రోజులుగా ఉన్నట్లు తెలిపారు. గత చివరి ఏడు రోజులకు డబ్లింగ్ రేటు 9.9 శాతంగా ఉందన్నారు. కరోనా వైరస్ వల్ల చాలా దేశాల్లో దయనీయ పరిస్థితి నెలకొన్నదని, అయితే మన దేశంలో అటువంటి పరిస్థితి లేదని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇక దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 59 663కు చేరుకున్నది. గత 24 గంటల్లో 3320 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 95 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్లో మొత్తం 39,834 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దాంట్లో 17,846 మంది రికవర్ అయ్యారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా వల్ల 1981 మంది చనిపోయారు. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 19063 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్లో 7402, ఢిల్లీలో 6318, తమిళనాడులో 6009 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 731 మంది చనిపోయారు.