ప్రపంచవ్యాప్త కరోనా మరణాలు 3 లక్షలు

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి విలయంలో మరో కీలక అంకె..! గురువారం నాటికి ప్రపంచవ్యాప్త మరణాలు 3 లక్షలను దాటాయి. లక్ష (ఏప్రిల్‌ 9) మరణాల నుంచి రెండు లక్షల (ఏప్రిల్‌ 24)కు 15 రోజుల వ్యవధి పట్టగా.. 3 లక్షలయ్యేందుకు 20 రోజుల సమయం తీసుకుంది. మరోవైపు కేసులు 45 లక్షలకు చేరువయ్యాయి. అమెరికాలో మృతుల సంఖ్య 85 వేలకు చేరింది. అగ్రరాజ్యంలో వైరస్‌ ప్రభావం మొదలైన రెండు నెలల్లో నిరుద్యోగ భృతికి 3.6 కోట్ల మందిపైనే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 30 లక్షల దరఖాస్తులు.. వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ మినహాయింపులు మొదలైన గత వారంలో వచ్చినవే.రష్యాలో పదకొండు రోజుల తర్వాత కొత్త కేసుల సంఖ్య పది వేల లోపునకు వచ్చింది. గురువారం 9,974 కేసులు నమోదవగా, మొత్తం సంఖ్య 25 వేలు దాటింది. మే 31 వరకు ఎమర్జెన్సీ విధించినా, కేసులు తగ్గుతుండటంతో జపాన్‌లో చాలా రీజియన్లలో దానిని ఎత్తివేశారు. టోక్యో సహా తీవ్రత ఎక్కువగా ఉన్న ఏడు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయి. లక్షణాలు కనిపించని 12 కేసులు సహా చైనాలో కొత్తగా 15 కేసులు బయటపడ్డాయి. స్థానిక వ్యాప్తి ద్వారా లియానింగ్‌ ప్రావిన్స్‌లో రెండు, జిలిన్‌ ప్రావిన్స్‌లో ఒక కేసు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో 1,452 కొత్త కేసులు తేలగా, 33 మంది చనిపోయారు. మరణాలు 770కి చేరాయి.