మే 31 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిపు -సీఎం కేసీఆర్

హైదరాబాద్: మే 31 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో సిటీ బస్సులను మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. ఇక ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతి లేదన్నారు. హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ట్యాక్సీ, ఆటోల్లో ముగ్గురు ప్రయాణికులకు అనుమతిచ్చారు. ఇక ఈనెల 31 వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపబోమన్నారు. కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అన్ని షాపులు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. సరిబేసి సంఖ్యలో మాత్రమే షాపులు తెరవాలన్నారు. అలాగే కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో సెలూన్లు ఓపెన్‌ చేయొచ్చని తెలిపారు. ఈ- కామర్స్‌ సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు వందశాతం పనిచేస్తాయన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, తయారీ యూనిట్లు పనిచేస్తాయని వివరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 31 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. అన్ని ప్రార్థనామందిరాలకు అనుమతి లేదని కేసీఆర్‌ తేల్చిచెప్పారు.