న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 41,00,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల 2,80,431 మంది మృతిచెందారు. కరోనా బారిన పడినవారిలో 14,39,916 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 23,80,276 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రపంచ పోలీస్ అని చెప్పుకునే అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నది. అగ్రరాజ్యమైన ఆ దేశంలో కరోనా కేసులు 13,47,309కి పెరిగాయి. దేంలో నిన్న ఒక్కరోజే ఈ వైరస్ ప్రభావంతో 1422 మంది మృతిచెందారు. దీంతో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 80,037కు పెరిగింది. స్పెయిన్లో కరోనా పాజిటివ్ కేసులు 2,63,783కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 26,478 మంది మరణించారు. కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ, మొదట్లో ఎక్కువగా మరణాలు నమోదైనది మాత్రం ఇటలీలో. ప్రస్తుతం ఆ దేశంలో 2,18,268 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి వల్ల ఇప్పటివరకు 30,395 మరణించారు. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో కరోనా కేసులు 2,15,260కి చేరాయి. ఇప్పటివరకు 31,587 మంది మృతిచెందారు. కరోనా కేసుల రేసులో రష్యా వేగంగా దూసుకుపోతున్నది. గత నాలుగు రోజులుగా వరుసగా 10 వేలకు పైగా కేసులు నమోదవతుండటంతో ఆ దేశం కరోనా పాజిటివ్లు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో ఐదో స్థానానికి చేరింది. రష్యాలో ఇప్పటివరకు 1,98,676 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో 1827 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 1,64,933 యాక్టివ్ కేసులు ఉండగా, 31916 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.