హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కొత్తగా తెలంగాణలో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.దీంతో..తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,634కు చేరింది. ఇప్పటివరకూ 1,011 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం కరోనా నుంచి కోలుకున్న 9 మందిని డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 585గా తెలిపింది. మంగళవారం కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 38కి చేరింది. కొత్తగా నమోదైన 42 కేసుల్లో 34 కరోనా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయినట్లు ప్రభుత్వం పేర్కొంది. మరో 8 మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 77 మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.