తమిళనాడులో రోజు రోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. కొద్ది రోజులుగా వరుసగా వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం 580 మందికి కరోనా పాజిటివ్ రాగా.. శుక్రవారం ఒక్క రోజే 600 కొత్త కేసులు వచ్చాయి. ఇవాళ నమోదైన కేసుల్లో 399 ఒక్క చెన్నైలోనివే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,009కి చేరింది. అలాగే శుక్రవారం ఒక్క రోజే కొత్తగా ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 40కి చేరింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ శుక్రవారం సాయంత్రం మీడియాకు వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6009 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. అందులో 40 మంది మరణించగా.. 1605 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 4361 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి చెప్పారు. కాగా, ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో చెన్నైలోనే 3,043 ఉన్నాయి. అందులో చెన్నై కోయంబేడు మార్కెట్లోనే 1,589 కేసులు వచ్చాయి.