కరోనాపై త్రివిధ ఔషధ దాడి విజయం

 ప్రపంచాన్ని గుప్పిటపట్టి గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి వైద్యులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఓ చికిత్స అంటూ రూపొందని కారణంగా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా హాంకాంగ్ వైద్యులు 127 మంది రోగులకు మూడు రకాల యాంటీ వైరస్ ఔషధాలు కలిపి ఇచ్చి చూశారు. హెచ్ఐవీ మందు రిటోనావిర్, హెపటైటిస్ మందు రిబావైరిన్, మల్టిపుల్ స్క్లెరోసిస్ మందు ఇంటర్‌ఫెరాన్-బీటాల మిశ్రమాన్ని తేలికపాటి నుంచి ఓమోస్తరు వరకు కరోనా లక్షణాలు ఉన్న 127 మందికి ఇచ్చారు. విడిగా ఓ నియంత్రిత బృందానికి కేవలం హెచ్ఐవీ మందు మాత్రమే ఇచ్చారు. రెండు గ్రూపులకు 5 రోజుల తేడాతో కరోనా అదుపులోకి వచ్చింది. నియంత్రిత గ్రూపు జబ్బు 12 రోజుల్లో తగ్గితే త్రివిధ ఔషధ మిశ్రమం ఇఅచ్చిన గ్రూపులో 7 రోజులకే కరోనా తగ్గిపోయింది. లాన్సెట్ మెడికల్ జర్నల్‌ తాజా సంచికలో ఈ ఫలితాలను ప్రచురించారు. లక్షణాలు బయటపడిన అనతికాలంలోనే త్రివిధ యాంటీ-వైరల్ డోసులు ఇస్తే వైరస్ చాలావరకు తగ్గిపోతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ప్రొఫసర్ కవోక్-యుంగ్ యుయెన్ తెలిపారు. ఈ విధానంలో వైరస్ లోడ్ తగ్గిపోవడమే కాకుండా చికిత్స జరిపే వైద్యులకు ముప్పు తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. తమ ప్రయోగంలో పాల్గొన్న రోగులకు ఈ మందులతోపాటుగా మామూలుగా సమకూర్చే వెంటిలేటర్, డయాలసిస్ ఏర్పాటుతోపాటుగా యాంటీ బయాటిక్స్, కార్టికో స్టిరాయిడ్స్ ఇచ్చామని వివరించారు. ఇతర నిపుణులు ఈ ప్రయోగాల పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. అయితే మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉందని వారు అంటున్నారు.