ఒకే స్టేష‌న్‌లో 9 మంది కానిస్టేబుళ్ల‌కు క‌రోనా పాజిటివ్

ముంబై, (ఆరోగ్యజ్యోతి):కరోనా వైరస్‌తో మహారాష్ట్ర అతలాకుతలం అవుతుంది. ఆ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా మరో కలకలం రేగింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో 9 మంది కానిస్టేబుళ్లకు క‌రోనా వైరస్ సోకింది. ముంబైలోని వడాలా పోలీస్ స్టేషన్‌లో ఇది చోటు చేసుకుంది. గురువారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో క‌రోనా పాజిటివ్ అని తేలడంతో వారంద‌ర్నీ వెంట‌నే ఆసుపత్రికి త‌ర‌లించారు. స్టేషన్‌ను శానిటైజ్ చేశారు.బాంద్రా, పరేల్, దక్షిణ ముంబైలోని గురునానక్, కేఈఎం, బాంబే హాస్పిటళ్లకు తరలించామ‌ని డిప్యూటీ కమిషనర్ రష్మి కరాండికర్ తెలిపారు. వైర‌స్ బారినపడిన కానిస్టేబుళ్లు అందరూ 50 ఏళ్లు పైబడినవారేనని, వారి కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్ చేశామని తెలిపారు.