ఒకే కుటుంబంలో 9 మందికి

మలక్‌పేట(ఆరోగ్యజ్యోతి): భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించడంతో ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా సోకింది. హైదరాబాద్‌ పాత మలక్‌పేట డివిజన్‌లో నలుగురు అన్నదమ్ములు, ఓ సోదరి కుటుంబాలు సమీప కాలనీల్లో నివసిస్తున్నాయి. వైరస్‌ సోకుతుందనే విషయాన్ని పట్టించుకోకుండా తరచూ కలుసుకొనేవారు. మొదట వాహెద్‌నగర్‌లో ఒకరికి న్యుమోనియా రాగా, గాంధీ దవాఖానకు తరలించారు. నాలుగురోజుల కిందట కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో అతడు కలిసిన వారి కుటుంబసభ్యులను 26 మందిని సరోజినీదేవి దవాఖానకు తరలించి పరీక్షలు నిర్వహించగా, వారిలో శంకర్‌నగర్‌లోని ముగ్గురికి, సరోజినీనగర్‌కాలనీలోని ముగ్గురికి, హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఇద్దరికి వైరస్‌ సోకినట్టు తేలటంతో వారిని కూడా గాంధీకి తరలించి వారి నివాసాలను కంటైన్మెంట్‌ చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, సౌత్‌జోన్‌ జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌, సర్కిల్‌- 6 డీసీ రజనీకాంత్‌ మొదట పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వాహెద్‌నగర్‌లోని వ్యక్తి ఇంటిని సందర్శించి వైద్యులకు, అధికారులకు పలు సూచనలుచేశారు.