మేడ్చల్,(ఆరోగ్యజ్యోతి) : రాష్ట్రంలోనే కరోనా అధిక కేసులు నమోదవుతోన్న జిల్లాల్లో మేడ్చల్ మల్కాజిగిరిజిల్లా కూడా ఉంది. జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. రెండురోజులుగా జిల్లాలో కొత్తగా పాజిటివ్ కేసులేమీ నమోదు కాలేదు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 472 మంది నమూనాలు సేకరించారు. వీటిలో పాజిటివ్ కేసులు 71 నమోదయ్యాయి. వీటిల్లో 59వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, అల్వాల్ మండలాల్లో ఉన్నాయి. బోడుప్పల్, నిజాంపేట్ మునిసిపాలిటీల్లో 7, కీసర మండలం చీర్యాలలో 3, శామీర్పేట్ మండలం తుర్కపల్లిలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాయంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్ నమోదైన ప్రాంతాలను కట్టడి జోన్లుగా ప్రకటించింది. ఈ వైరస్ జిల్లాలోని శివారుల్లో విస్తరించకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లాకు చెందిన వ్యక్తులు విదేశాల్లో పర్యటించి వచ్చిన వారితోపాటు ఢిల్లీలో మర్కజ్ సదస్సుకు వెళ్లొచ్చిన 60 మందిని గుర్తించారు. వీరు ఎవరెవర్ని కలిశారన్న వివరాలు సేకరించారు. మొత్తం 47 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేపట్టారు. అనుమానితులను కట్టడి కేంద్రాలకు తరలించారు. గ్రామాల్లో వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు.20రోజులకు పైగా శివారులోని మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో మొదట నమోదైన కేసులు తప్ప కాంటాక్టు కేసులేమీ నమోదు కాలేదు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులతో కట్టడి జోన్లలో పర్యటిస్తూ కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతాలకు నిత్యావసరాలను పంచాయతీ, మునిసిపాలిటీ సిబ్బందితో అందజేశారు. పల్లెలు, పట్టణాల్లో క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేశారు. వైద్యులు సూచన మేరకు ప్రజలు స్వీయ నిర్బంధం పాటించారు. గ్రామీణ ప్రాంతాలైన తుర్కపల్లి, చీర్యాలలో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో కట్టడి జోన్ల ఎత్తివేతపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.