సీసీఎంబీలో కరోనా యాంటీబాడీ థెరపీ

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) యాంటీ బాడీ థెరపీని రూపొందిస్తున్నది. దాంతోపాటు వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా ప్రయోగాలు చేస్తున్న ఫార్మా కంపెనీలకు ‘ఇన్‌యాక్టివ్‌ వైరస్‌'ను అందించడానికి ప్రయత్నిస్తున్నది. దీనిపై సీసీఎంబీతో పలు ఫార్మా కంపెనీలు చర్చిస్తున్నాయి. సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా నేతృత్వంలోని దాదాపు 20 మంది శాస్త్రవేత్తలు కరోనా బాధితులకు ఔషధంలా పనిచేసేలా యాంటీ బాడీ థెరపీని రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. గుర్రంపై ఈ ప్రయోగాలు చేస్తున్నట్టు సమాచారం. జంతువు శరీరంలోకి వైరస్‌ను ప్రవేశపెట్టి యాంటీ థెరపీ ఇంజెక్షన్‌ను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిపై ప్లాస్మా థెరపీని ప్రయోగిస్తున్నారు. ఇది అంత మంచిది కాదని ఐసీఎమ్మార్‌ పేర్కొన్నది. కానీ ప్రస్తుతం సీసీఎంబీ మాత్రం పాము కాటుకు యాంటీ వీనమ్‌ ఎలా ప్రయోగిస్తారో అదేవిధంగా జంతువుపై ప్రయోగించిన వైరస్‌ నుంచి ‘యాంటీ బాడీ థెరపీ’ని సృష్టిస్తున్నది. దీనిద్వారా వైరస్‌ తగ్గకపోయినా ఆరోగ్యం దెబ్బతిన్న రోగి ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నిర్మూలనకు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న ఫార్మా కంపెనీలకు సీసీఎంబీ తన వంతు సహకారాన్ని అందించే ప్రయోగాలను ప్రారంభించింది. కరోనా వైరస్‌ను జీవంలేకుండా ‘ఇన్‌యాక్టివ్‌' చేసి దానిని ప్రయోగాలకు వాడుతారు. ఇన్‌యాక్టివ్‌ వైరస్‌ను ఇతరుల శరీరంలోకి ప్రవేశపెట్టి క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తారని సమాచారం. వైరస్‌ను ఇన్‌యాక్టివ్‌ చేసే ప్రయోగాలను వేగవంతం చేసినట్టు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. మరోవైపు కరోనా వైరస్‌ జన్యు పరిణామ క్రమాన్ని కనుగొనే ప్రక్రియను మొదలుపెట్టిన సీసీఎంబీకి పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలాజీ ల్యాబ్‌ నుంచి ఇటీవలే కొన్ని శాంపిళ్లు చేరాయి. ఈ నమూనాలను పరిశీలించి వాటి జన్యుక్రమాన్ని గుర్తించడానికి ప్రయోగాలను ముమ్మరంచేశారు. విదేశాల్లో ప్రబలుతున్న కొవిడ్‌కు మన దేశంలో వ్యాప్తిచెందుతున్న వైరస్‌కు తేడా ఏమిటి? దాని తీవ్రత ఎంత వరకు ఉన్నది? మన వద్ద ఉన్న వైరస్‌ భిన్నమైనదా? అన్న అంశాలపై జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షలు జరుగుతున్నాయి. దానినిబట్టి వ్యాక్సిన్‌ తయారీలో ఫార్మా కంపెనీలకు తగిన సూచనలు, సలహాలు అందించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే సీసీఎంబీ కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నది. ఇదే సమయంలో ఫార్మా కంపెనీలు తయారుచేస్తున్న టెస్ట్‌ కిట్లు ఉపయోగకరమా లేదా అనే దానిని నిర్ధారణ చేస్తున్నది.