అధిక కరోనా మరణాలకు కారణం అదేనా?

అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక కరోనా మరణాలకు కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లేనని బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన వైద్యుడు డాక్టర్ అసీమ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లోని జాతీయ వైద్యసేవా విభాగం (ఎన్‌హెచ్ఎస్) ముఖ్యుల్లో ఒకరైన డాక్టర్ మల్హోత్రా ఊబకాయం, అధికబరువు కరోనా మరణాలకు ముఖ్య కారణమని అన్నారు. జీవన విధాన సంబంధ ఆరోగ్య సమస్యలతో సతమతం అయ్యే భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనాపై పోరులో జీవన విధాన మార్పులు ముఖ్య ఆయుధమని డాక్టర్ అసీమ్ మల్హోత్రా ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. విశేషించి టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు అనేవి కరోనా మరణాలకు మూడు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. అధికంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం అనేది మూల సమస్య అని తెలిపారు. అమెరికా, బ్రిటన్లలో 60 శాతం పైగా వయోజనులు స్థూలకాయులని గుర్తు చేశారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవన విధానాన్ని కొన్ని వారాల్లోనే సాధించవచ్చని ఆయన అన్నారు.