న్యూఢిల్లీ: వచ్చే మార్చి కల్లా దేశం మొత్తానికి ఒకే రేషన్ కార్డు ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్.. ఒకే దేశం-ఒకే కార్డ్ వివరాలను వెల్లడించారు. రేషన్కార్డులు కలిగి ఉన్నవారు 2021 మార్చి నుంచి దేశంలోని ఏప్రాంతం నుంచైనా రేషన్ సరుకులు పొందేలా చర్యలు తీసుకొంటామని ఆమె తెలిపారు. ముఖ్యంగా వలసకార్మికులు ఇతర ప్రాంతాలకు పని నిమిత్తం వెళ్లినప్పుడు రేషన్ తీసుకోలేకపోతున్నందున వాళ్లు చాలా నష్టపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి సాంకేతిక ఆధారిత వ్యవస్థ సంస్కరణలో భాగంగా తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో 23 రాష్ట్రాల్లోని 67 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఇలాఉండగా, ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకొనే విధానాన్ని దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ ఆలోచనల్లోంచి పుట్టిన ఈ విధానాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలుచేసేందుకు చూస్తున్నది.