ఎల్‌బీనగర్‌ను కుదిపేస్తున్న కరోనా.. ప్రజల్లో వణుకు


  • వరుస కేసులతో ప్రజల్లో వణుకు   

  • మూడు రోజుల్లోనే తొమ్మిది మందికి పాజిటివ్‌


 


‌ఎల్‌బీనగర్‌ : కరోనా వైరస్‌ ఎల్‌బీనగర్‌ను కుదిపేస్తోంది. నెల రోజుల వ్యవధిలో 19 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అందులో ఇద్దరు కోలుకోగా... మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఆ పరిసరాల ప్రజలు కలవరపడుతున్నారు. సరూర్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ సర్కిళ్ల పరిధుల్లో వరుసగా కరోనా కేసులు నమోదవుతుండగా.. బీఎన్‌రెడ్డినగర్‌లో శనివారం రెండు పాజిటివ్‌ కేసులతో ఇక్కడి ప్రజల్లో గుబులు నెలకొంది. పదిహేను రోజుల తర్వాత ఒకేరోజు వనస్థలిపురం ఇంజనీర్స్‌కాలనీలో ఓ బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగార్డుకు, చంపాపేట మారుతీనగర్‌లో ఓ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌కు కరోనా సోకడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. నివారణ చర్యలు చేపడుతుండగానే శారదానగర్‌లో ఏప్రిల్‌ 26న మరో పాజిటివ్‌ కేసు బయటపడింది. మలక్‌పేట గంజ్‌లో పల్లీల వ్యాపారం చేసే వ్యక్తి దగ్గు జ్వరంతోనే శ్రీకృష్ణదేవరాయనగర్‌ కాలనీకి చెందిన బావమరిది, వనస్థలిపురం కాంప్లెక్స్‌లో ఉండే సోదరుడి వద్దకు వెళ్లాడు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో మరో రెండు ఆస్పత్రులను ఆశ్రయించారు. 25న సోమాజిగూడలోని ఆస్పత్రిలో చేరిన అతడికి నమూనాలు సేకంచి పరీక్షించగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అతడి తండ్రి, సోదరుడు, బావమరిది, కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు తరలించారు. 29న పల్లీవ్యాపారి కొడుకుకి, అతడి బాబాయికి పాజిటివ్‌ వచ్చింది. తండ్రి, బాబాయి మరణించారు. ఏప్రిల్‌ 30న పల్లీ వ్యాపారి భార్యతో పాటు తిరుమలనగర్‌కు చెందిన 74 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఇదిలా ఉండగా శుక్రవారం పల్లీవ్యాపారి తల్లికి పాజిటివ్‌ రాగా శనివారం బాబాయి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లకు కూడా పాజిటివ్‌ వచ్చింది. అతడి బావమరిది, భార్య, కొడుకులకు కూడా పాజిటివ్‌ వచ్చింది. ఆదివారం సాయినగర్‌కు చెందిన ఓ వృద్ధురాలికి పాజిటివ్‌ వచ్చింది.