రాజన్న సిరిసిల్ల : కరోనా వైరస్ రాజన్న సిరిసిల్ల జిల్లాను తాకింది. ముంబయి నుంచి సిరిసిల్ల జిల్లాకు వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆదివారం రాత్రి వైద్యాధికారులు వెల్లడించారు. సిరిసిల్ల అర్బన్ మండలంలోని చంద్రంపేట గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు వేములవాడ మండలంలోని నాగంపల్లికి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకింది. వీరిద్దరి వయసు 45 ఏళ్ల పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్కు పంపించారు.చంద్రంపేట, నాగంపల్లి గ్రామాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ రెండు గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు.. అక్కడ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఏప్రిల్ నెలలో వేములవాడ పట్టణంలో ముగ్గురు యువకులకు కరోనా సోకిన విషయం విదితమే.