తెలంగాణలో పెరుగుతున్న కరోన..రెండో రోజు అదే తీరు

హైదరాబాద్: తెలంగాణలో చాపకింద నీరు లాగా కరోనా విజృంభిస్తోంది. ఆదివారం తెలంగాణలో కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 1,196కు కరోనా పాజిటివ్‌ కేసులు చేరాయి. 415 మంది కరోనా బాధితులకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు 751 మందిని డిశ్చార్జ్‌ చేశామని అధికారుల తెలిపారు. అయితే కరోనా వల్ల 30 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం జీహెచ్‌ఎంసీలో 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఏడుగురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. గత 14 రోజులుగా 24 జిల్లాల్లో కొత్త కేసులు నమోదుకాలేదు. నాలుగైదు రోజులుగా సగటున 12 కరోనా కేసులు రాగా.. శనివారం ఏకంగా 30 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులన్నీ గ్రేటర్‌ పరిధిలోని కావడం గమనార్హం. ఏప్రిల్‌ 21న తెలంగాణలో 56 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత అత్యధికంగా ఆదివారం 33 కేసులు పాజిటివ్‌ వచ్చాయి.మూడు నాలుగు రోజుల నుంచి వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆదివారం వనస్థలిపురంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. హుడా సాయినగర్‌కాలనీలో ఓ ఇంట్లో పనిమనిషికి కరోనా సోకింది. పనిమనిషి ద్వారా కారు డ్రైవర్‌, అతని భార్యకు కరోనా విస్తరించింది. ఓ వృద్ధురాలితో పాటు మూడు ఇళ్లలో మహిళ పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వృద్ధురాలి ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా అధికారులు తేల్చారు. అంతేకాకుండా 17 మంది శాంపిల్స్‌ అధికారులు సేకరించారు.గ్రేటర్‌లో కట్టడి చేస్తున్న ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కట్టడి లేని ప్రాంతాల్లో వైరస్ విస్తరిస్తోంది. ఇతర ప్రాంతాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 30 మంది మృతి చెందారు. అయితే గ్రేటర్‌లోనే 25 మంది మృతి చెందినట్లు సమాచారం. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య జీహెచ్‌ఎంసీలో అధికంగా ఉండడంతో నగరావాసులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మూడు జిల్లాలను కేంద్ర రెడ్‌జోన్లుగా ప్రకటించింది