ఆయుర్వేద రక్ష కిట్లను లాంచ్‌ చేసిన మంత్రి ఈటల

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా  ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది కూడా ఆరోగ్యంగా ఉండాలని  తెలంగాణ ప్రభుత్వం  కోరుకొంటున్నది. కరోనా సేవకుల్లో వ్యాధి నిరోధకశక్తి పెరిగేందుకు రాష్ట్ర ఆయుష్‌ విభాగం  సిద్ధం  చేసిన ప్రత్యేక ఆయుర్వేద రక్ష కిట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. అనంతరం పోలీసులు, వైద్యులు, శానిటేషన్‌ సిబ్బందికి ప్రత్యేక కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ జాయింట్‌ సీపీ  విశ్వనాథ్‌, ఐజీపీ (హోంగార్డ్స్‌) బాలనాగదేవి, ఆయుష్‌ కమిషనర్‌ డాక్టర్‌ వర్శినితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఒక్కో ఆయుర్వేద కిట్‌లో ఐదు వేర్వేరు ఆయుర్వేద ఆధారిత మందులు ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో సహకరిస్తాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల కిట్లను పంపిణీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు.