గల్ఫ్ బాధితుడికి చేయూతనిచ్చిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్,(ఆరోగ్యజ్యోతి): కష్ట కాలంలో పేదలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే  మాజీ ఎంపీ, కల్వకుంట్ల కవిత మరోమారు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి సాయమందించి తన ఔదార్యం చాటుకున్నారు. గల్ఫ్ దేశం నుంచి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ చేరిన వ్యక్తికి అర్థరాత్రి సైతం చేయూతనందించి దవాఖానలో మెరుగైన చికిత్స అందించేలా కృషి చేశారు.  నిజామాబాద్ జిల్లా బాల్కొండ ‌నియోజకవర్గం ‌పల్లికొండ గ్రామానికి చెందిన దొనుపాల‌ రవీందర్ ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం మస్కట్ కు వెళ్లాడు. ఆర్థిక ‌ఇబ్బందులతో సతమతమవుతున్న రవీందర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.అయితే రవీందర్ పరిస్థితిపై, అతని సహచరులు ఇండియన్ ఎంబసీ‌ అధికారులకు సమాచారం అందించారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఇండియన్ ఎంబసీ అధికారులు హైదరాబాద్ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో రవీందర్ సోమవారం రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. రవీందర్ ను ఆదుకోవాలని అతని కుటుంబ సభ్యులు కవిత సహాయం కోరారు. వెంటనే రవీందర్ చికిత్సకు అవసరమైన సహాయ సహకారాలు ‌అందించాల్సిందిగా తెలంగాణ జాగృతి ‌నాయకులకు మాజీ ఎంపీ ‌కవిత ఆదేశించారు. మాజీ ఎంపీ సూచన మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న తెలంగాణ జాగృతి నాయకులు, ఎయిర్ పోర్ట్ లో వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో, రవీందర్ ను ఉస్మానియా దవాఖానకు  తరలించారు. ప్రస్తుతం రవీందర్ కు ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. అడిగిన వెంటనే స్పందించి, అర్థరాత్రి సైతం మానవత్వంతో సహాయం చేసిన మాజీ ఎంపీ కవితకు రవీందర్ ‌కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.