కరోనా వైరస్ వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ దెబ్బతింటున్నది. నిరుపేద దేశాల్లో అవాంఛిత గర్భాల సంఖ్య కోటి దాటే అవకాశం ఉన్నట్లు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనా వేస్తున్నది. లాక్డౌన్ నిబంధన వల్ల కుటుంబ నియంత్రణ సర్వీసులన్నీ స్తంభించిపోయాయి. కోవిడ్19 కేసుల వైపు వైద్య వ్యవస్థ మొత్తం కేంద్రీకృతమై ఉన్నది. ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా.. స్టాఫ్ వద్ద పీపీఈ కిట్లు లేవు. ఎక్కడికి వెళ్లవద్దు అన్న ఆంక్షలు అమలులో ఉండడం వల్ల కూడా మహిళలు హాస్పిటళ్లకు వెళ్లడం లేదు.
ప్రస్తుతం రవాణా స్తంభించడంతో.. గర్భనిరోధక పద్ధతులకు కూడా బ్రేక్ పడింది. కండోమ్స్ అంతటా లభించడం లేదు. రానున్న ఆరు నెలల్లో.. అతి తక్కువ ఆదాయం కలిగిన సుమారు డజన్ దేశాల్లో స్టాక్ ఔట్ బోర్డులు కూడా దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నాయి. పేదలు, బలహీన వర్గాల వారికి కుటుంబ నియంత్రణ గురించి తెలియజేసే వ్యవస్థ అందుబాటులో ఉండకుండాపోతున్నది. ఒకవేళ లాక్డౌన్ మూడు నెలల పాటు ఇలాగే ఉంటే.. దాని వల్ల సుమారు కోటి 30 లక్షల మంది గర్భనిరోధక పద్ధతులకు దూరం కానున్నారు. ఆధునిక కాంట్రాసెప్టివ్స్కు వాళ్లు అందుబాటులో ఉండరు. దీంతో సుమారు మూడు లక్షల 25వేల అవాంఛిత గర్భాలు వచ్చే అవకాశం ఉన్నట్లు యూఎన్ఎఫ్పీఏ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నటాలియా కనెమ్ తెలిపారు.
ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్కు అవసరమైన సేవలకు ఏడాది పాటు విఘాతం కలిగితే, అప్పుడు పరిస్థితి మరింత సీరియస్గా ఉండే అవకాశం ఉన్నది. ఏడాది పాటు అవరోధాలు ఉంటే, అప్పుడు 5 కోట్ల మంది మహిళలు ఆధునిక గర్భనిరోధక పద్ధతులకు దూరం అవుతారు. దాని వల్ల సుమారు కోటిన్నర అవాంఛిత గర్భాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్ నటాలియా తెలిపారు. మహమ్మారి కరోనా వల్ల అసమానతులు పెరిగాయని, లక్షల సంఖ్యలో మహిళలు కుటుంబ నియంత్రణ చేసుకోలేకపోతున్నారని, వారి శరీరాలను, ఆరోగ్యాలను కాపాడుకోలేకపోతున్నట్లు ఆమె తెలిపారు.