ఫిలిభిత్ (ఉత్తరప్రదేశ్): లాక్డౌన్ సమయంలో అటవీ గ్రామంలో వేర్వేరుగా ఓ పులి దాడి చేసిన ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజ్రౌలా ప్రాంతంలో జరిగింది. గజ్రౌలా గ్రామానికి చెందిన రాంబహదూర్, ఉజాగర్ సింగ్, లలితా ప్రసాద్ లనే ముగ్గురు గ్రామస్థులు పులి దాడి ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు పులిని పట్టుకొని ట్రాక్టరులో తీసుకువెళుతుండగా అది గ్రామస్థులపై దాడికి యత్నించింది. అనంతరం ట్రాక్టరుపై నుంచి పులి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. ఈ దాడి ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయింది. తమ ఇంటి ముందున్న పులి దారిన పోతున్న ముగ్గురిపై దాడి చేసిందని మిలాప్ సింగ్ అనే గ్రామస్థుడు చెప్పారు. పులి దాడి గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా వారు నాలుగుగంటల తర్వాత వచ్చారు. పులులు తమ గ్రామంలోకి రాకుండా ఫెన్సింగ్ వేయాలని కోరినా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెప్పారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కు తోడు పులి సంచారంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.