హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : ఇవాళ లేబర్ డే. కార్మిక దినోత్సవం. కానీ మహమ్మారి కరోనా.. కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో శ్రామిక వర్గం తీవ్ర అవస్థలు అనుభవిస్తున్నది. వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులను అక్కున చేర్చుకున్నది. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించింది. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి లోటు రాకుండా చేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో.. స్వంత ఊళ్లకు వెళ్లాలనుకునే వలసకూలీలకు రెండు రోజుల క్రితమే కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తే.. కూలీలు వెళ్లిపోవచ్చు అన్న సంకేతాన్ని వినిపించింది. వలస కూలీలను రాష్ట్ర వికాస ప్రతినిధులుగా భావించిన తెలంగాణ సర్కార్ వెంటనే స్పందించింది. సంగారెడ్డిలో ఉంటున్న కార్మికులను ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇవాళ ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ సబర్బన్ రైల్వే స్టేషన్ లింగంపల్లి నుంచి జార్ఖండ్లోని హతియాకు ప్రత్యేక రైలు వెళ్లింది. సుమారు 1225 మంది వలస కార్మికులతో ఆ రైలు కూతపెట్టింది. అయితే భిన్న ప్రాంతాల్లో ఉన్న కూలీలను రైల్వే స్టేషన్ వద్దకు తీసుకురావడం అంత సులభం కాదు. లాక్డౌన్ ఆంక్షల నడుమ కార్మికులను స్టేషన్కు తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం వారికి ఎంతో సహకరించింది. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యులైన వలస కార్మికులను అత్యంత ఉన్నతంగా చూడాలన్నదే తెలంగాణ సర్కార్ ఉద్దేశం. అందుకే ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వను కోరింది. రాష్ట్ర సర్కార్ విన్నపం మేరకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఇవాళ ఉదయం 4.50 నిమిషాలకు కదిలిన ఆ రైలు శనివారం రాత్రి వరకు జార్ఖండ్లోని హతియాకు చేరుకోనున్నది.
వలస కార్మికుల తరలింపులో సోషల్ డిస్టాన్సింగ్ లాంటి అన్ని నియమాలను పాటించారు. ప్రతి ప్రయాణికుడికి ఆహార పొట్లాలను సరఫరా చేశారు. వలస కూలీలకు ఆకలి బాధలు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. నిజానికి వలస కూలీలను ఫ్యామిలీ మెంబర్స్లా చూస్తామని సీఎం కేసీఆర్ మార్చి 29న జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. వారందరికి పూర్తి భరోసా ఇచ్చారు. వలస కార్మికులెవరైనా రేషన్ ఇస్తామన్నారు. ఎటువంటి ఫికర్ పెట్టుకోవద్దు అన్నారు. సొంత ఊళ్లకు వెళ్లాలన్న టెన్షన్ వద్దు.. మీరు మా బిడ్డలు అన్న సీఎం కేసీఆర్ మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. అయితే లాక్డౌన్ పొడిగింపు కావడంతో ఆందోళనకు గురవుతున్న వలస కార్మికులను ఇక స్వంత ఊళ్లకు సాగనంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో సర్కార్ ఎటువంటి తత్తరపాటుకు గురికాలేదు. వైరస్ వ్యాప్తిని నియంత్రించే క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేసింది. చాలా సమయోచితంగా వలస కార్మికుల కోసం రైలు ఏర్పాటు చేసింది. ఎటువంటి వివక్ష చూపకుండా.. వారిని సంతోషపరుస్తూ స్వంత ఊళ్లకు పంపింది.
లింగంపల్లి నుంచి బయలుదేరిన రైలులోని ప్రతి బోగీలో 54 మంది ప్యాసింజెర్లు ఉండేలా చూశారు. వాస్తవానికి స్లీపర్ బోగీలో 72 సీట్లు ఉంటాయి. కానీ సోషల్ డిస్టాన్సింగ్ నియమం ప్రకారం 54 మందిని కూర్చోబెట్టారు. స్లీపర్ కోచ్ల్లో మధ్య బోగీలను ఖాళీగా వదిలేశారు. రైలు కదిలి వెళ్లకముందే.. కార్మికులందరికీ స్క్రీనింగ్ చేశారు. జ్వరం, ఇతర వైరస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేశారు. దేశానికి రైతు వెన్నుముక అన్నట్లుగా.. భారత్ లాంటి భారీ ఆర్థిక వ్యవస్థకు వలస కార్మికులే వెన్నుముక. అలాంటి కార్మికుల రక్షణ కోసం వివిధ ప్రభుత్వ విభాగాధిపతులు వీలైనంత సహకరించారు.
కార్మికులను రైల్వే స్టేషన్కు తరలించేందుకు 56 బస్సులను వాడారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో కట్టుదిట్టంగా బారికేడ్ చేశారు. వలస కూలీలు తప్ప మరో వ్యక్తి స్టేషన్లోకి చొరబడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆర్పీఎఫ్ బృందాలు.. కూలీలు ఓ వరుసలో వచ్చే విధంగా చూశారు. రైల్వేకు చెందిన కమర్షియల్ సిబ్బంది.. కూలీలకు టికెట్లు ఇష్యూ చేసింది. ఆహార ప్యాకెట్లు, నీటి బాటిళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైల్వే, ప్రభుత్వ శాఖల అధికారులతో వలస కూలీల డిపార్చర్ ప్రశాంతంగా జరిగింది. పోలీసులు, రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ప్రయాణికులకు చప్పట్లతో బైబై చెప్పారు. థ్యాంకూ సార్ అంటూ కూలీలు కూడా చేతులు ఊపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వంత ఇండ్లకు వెళ్తున్న ఆ కార్మికుల్లో ఆనందాన్ని నింపింది తెలంగాణ సర్కారే. ఆ చిరునవ్వులు ఎప్పటికీ ఉండాలంటే.. వారంతా కచ్చితంగా క్వారెంటైన్కు వెళ్లాల్సిందే. వైరస్ నుంచి బ్రతికి బట్ట కట్టాలంటే మాత్రం.. స్వీయనియంత్రణ తప్పదు. కార్మిక దినోత్సవం రోజున.. వలస కూలీల కోసం దేశంలో నడిచిన తొలి రైలు ఇదే కావడం విశేషం.