గ్రీన్‌జోన్‌ దిశగా కరీంనగర్‌

కరీంనగర్‌ (ఆరోగ్యజ్యోతి): జిల్లాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇక్కడ చేపట్టిన వైరస్‌ నియంత్రణ చర్యలను సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌లోకి వచ్చిన జిల్లాలో క్రమంగా కంటైన్‌మెంట్‌ ఏరియాలను ఎత్తివేశారు. మార్చిలో ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు, మర్కజ్‌ ప్రార్థనలకు  వెళ్లి వచ్చిన వారి కారణంగా జిల్లాలో 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మంది కోలుకుని హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.  ఒక్కరు మాత్రమే హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 546 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, 522 మందికి నెగెటివ్‌ వచ్చింది. 19 మందిలో కరోనా లక్షణాలు బయటపడగా, చికిత్స తర్వాత 18మందికి నెగిటివ్‌ వచ్చింది. మిగతా వారి రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. 


ఇండోనేషియన్లతో వెలుగులోకి..


ఇండోనేషియా మతప్రచారకుల రాకతో జిల్లాలో పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. వారు తిరిగిన ముకరంపుర, కశ్మీర్‌గడ్డ ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించిన అధికారులు వైరస్‌ కట్టడికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వైరస్‌ అదుపులోకి వచ్చిన తరుణంలో హుజూరాబాద్‌కు చెందిన కొందరు మర్కజ్‌కు వెళ్లి రావడంతో వారిలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు కరీంనగర్‌లోని ముకరంపుర, మంకమ్మతోట, సాహెత్‌నగర్‌, హుజూరాబాద్‌లోని మార్కెట్‌ ఏరియా, సిద్ధార్థనగర్‌, కాకతీయకాలనీ, మామిండ్ల్లవాడను కంటైన్‌మెంట్‌ ఏరియాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో 1.32 లక్షల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. 14 రోజులుగా పాజిటివ్‌ కేసులు లేకపోవడంతో కంటైన్‌మెంట్‌ జోన్లను ఎత్తివేశారు. అయినప్పటికీ 69 బృందాలతో ఇప్పటికీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌వో వెల్లడించారు.