నిర్మల్, (ఆరోగ్యజ్యోతి): నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ను అధికారులు కట్టడి చేశారు. జిల్లాలో 9 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు పాత కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నది. రెడ్జోన్లో ఉన్న జిల్లా తాజాగా ఆరెంజ్ జోన్లోకి వచ్చింది. నిర్మల్ జిల్లాలో 20 కరోనా పాజిటివ్ కేసులు న మోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. వీరందరికి గాంధీ దవాఖానలో చికిత్స చేయిస్తుండగా.. ఇప్పటికే 13 మంది బాధితులు డిశ్చార్జి అయ్యా రు. ప్రస్తుతం ఏడుగురు మాత్రమే చికిత్స పొందుతున్నారు. వీరు సైతం రేపోమాపో డిశ్చార్జి కానున్నారు. మరికొన్ని రోజుల్లో కేసులు పూర్తిగా లేకుండా పోనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. జిల్లాలో 16 కంటైన్మెంట్ జోన్లు ప్రకటించగా.. ఇప్పటికే తొమ్మిదింటిని ఎత్తివేశారు. వరుసగా 14 రోజులపాటు కొత్త కేసులు నమోదు కాకపోతే కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు, రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగింపు తెలంగాణలో ఏ విధంగా అమలు చేయాలనేది ఈ నెల 5 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.